విఘ్నేశ్వరుడు (చందమామ)_21 Vignaeswarudu Novel (CHANDAMAMA)

 విఘ్నేశ్వరుడు (చందమామ) 

Vignaeswarudu Novel (CHANDAMAMA)

21. అవ్వ చరిత్ర


హెమాగ్నినుండి పుట్టిన భయంకరమైన జంతువు అదృశ్యంకాగానే కాలుడు విఘ్నాసుర రూపం దాల్చి కాలపాశాన్ని విశిరాడు. కాల పాశం గిరగిరా తిరుగుతూ ప్రళయంగా అంతా చుట్టబెట్టింది. అభినందనుడు పరాక్రమించి దాన్ని ఛేదించడానికి యత్నించి నేలకొరిగాడు, కాలపాశం మరింత విజృంభించి జీవకోటిని అంతమొందిస్తూంటే వశిష్ఠుడు మొదలైన సప్తమహర్షులు, ఋషులు, లోకకళ్యాణం కోరేవారంతా కలిసి బ్రహ్మను ప్రార్ధించారు.


బ్రహ్మ, “కాలపాశాన్ని తప్పించడం ఎవరితర మూ కాదు. కాలప్రభావాన్ని అరికట్టి కాలుణ్ణి నిగ్రహించగల వాడు గణేశుడొక్కడే!” అని చెప్పి వారందరితో కలిసి గణేశ్వరుడిని ప్రార్ధించాడు.


మహాగణాధిపతి స్వస్తికాపీఠంపై ఆశీనుడై సాక్షాత్కరించాడు. తన చేతనున్న పాశాన్ని వదిలాడు. గణేశుని పాశం కాలపాశాన్ని ఉచ్చుపన్ని పట్టినట్లు గణాధిపతి ముందు కట్టి పడేసింది.


కాలుడు పరాభవంతో మండిపడుతూ మరింత భీకర జుగుప్సాకరంగా విఘ్నాసుర రూపం చూపుతూ కాలదండాన్ని ఎత్తి ఝళిపించాడు. గణేశుడు అంకుశాన్ని వదిలాడు. అంకుశం విఘ్నాసురుడి వెన్నెముకలో గుచ్చింది.


విఘ్నాసురుడు అంకుశం తాకిడితో అలా అలా కుదించుకుపోయి, అంకుశం వెన్నంటి తరుముతూండగా శరణు కోరుతున్నట్లుగా గణేశుడి రెండు పాదాల ఇరుకున పడి బందీగా చిక్కుకున్నాడు. గజముఖుడు విఘ్నాసురుణ్ణి రెండు పాదాలతో గట్టిగా నొక్కాడు.


అప్పుడు కాలుడు విఘ్నాసురుడి నుంచి బయటపడి గణేశుడికి మొక్కుతూ, “గణేశా! నీ మహావిశ్వపాశం ముందు యీ భూమికి, సూర్యోదయ సూర్యాస్త మయాలకు మాత్రమే సంబంధించిన నా కాలపాశం ఎంత! విశ్వాన్ని అదుపులో ఉంచే నీ అంకుశం ముందు నా దండ మేపాటిది! పర్వతంలాంటి భూతాన్ని నీ వాహన రూపాలైన చిట్టెలుకలు తుదముట్టించాయి! నీవు విఘ్నాసురుణ్ణి అధీనంలో పెట్టుకొన్న విఘ్నేశ్వరుడివి దేవా, నన్ను మన్నించు” అని వేడుకున్నాడు.


విఘ్నేశ్వరుడు, “కాలా! ఇతరుల పని నెత్తిని వేసుకోవడం కోరి ముప్పు తెచ్చుకోవడమే! నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు! ఇక యిక్కడి నుంచి కదిలి వెళ్ళు.” అని మందలించాడు.


కాలుడు మెలివేసిన చేతులతో చెవులు పట్టుకుని మూడుసార్లు వంగి లేచి, లెంపలు వేసుకొని, “బుద్ధి బుద్ది! ఆ ఇంద్రుడి మాట విని గడ్డి కరిచాను, బుద్ధి వచ్చింది దేవా! విఘ్నేశ్వరుడవైన నిన్ను నమ్మి కొల్చినవారి దాపులకు నేను పోను, వారిని వ్యాధులు సోకవు, వారికి విఘ్నాలుండవు!” అని చెప్పి శలవు తీసుకున్నాడు.


కాలుణ్ణి విఘ్నేశ్వరుడు భంగపుచ్చినప్పుడే కాలపాశంవల్ల నేల కొరిగిన అభినందన మహారాజు మొదలైనవారంతా సజీవులై నిద్రలేచినట్లు లేచారు. పూలజల్లు కురిసింది.


వినాయకుణి విఘ్నేశ్వరుడనీ, విఘ్నరాజు అని అందరూ కీర్తించారు.

అప్పట్నించీ, ఏ మంచి పనికైనా, శుభ కార్యానికైనా స్వస్తికను ముగ్గుగా తీర్చిదిద్దడం, పసుపు ముద్దను విఘ్నేశ్వరుని ప్రతిరూపంగా ఉంచి పూజించడం సంప్రదాయంగా నిలిచింది.


“కాలపురుషుణ్ణి భంగపుచ్చి పాదాక్రాంతుణ్ణి చేసుకొన్న విఘ్నేశ్వరుడి మీద విశ్వాసం కలవారూ, విఘ్నేశ్వరుడి ఆశీర్వాద బలం ఉన్నవారూ కాల ప్రవాహానికి ఎదురీత ఈది నిలదొక్కుకొని, విజయం సాధించగలరు!” అని చెప్పి పావన మిశ్రుడు ముగించాడు.


ఒక నాటి సాయం కాలం ఒక బాలిక పావనమిశ్రుడి దగ్గరకు వచ్చి, అతడి చిటికెన వేలు పట్టుకొని ఒక కుడ్య చిత్రం దగ్గరకు తీసుకు వెళ్ళింది.


ఆ చిత్తరువులో అసమాన సౌందర్యం గల ఒక కన్య విఘ్నేశ్వర విగ్రహాని కెదురుగా మోకరిల్లి నమస్కరిస్తున్నది. ముక్కుపచ్చలారని ఆమె తల ముగ్గు బుట్టలా ఉంది. పావనమిశ్రుడు ఆ కథ చెప్పడం ప్రారంభించాడు:


ఒక పుణ్య దంపతులకు విఘ్నేశ్వరుని ఆరాధించిన వరప్రసాదంగా రత్నంలాటి ఆడపిల్ల పుట్టింది. పుడుతూనే ఆ శిశువు పురిటిగదికి ఎదురుగా గూటిలో ఉన్న విఘ్నేశ్వర ప్రతిమను విప్పారిన కన్నులతో చూస్తూ, ఆ బొమ్మ పిలుస్తున్నట్లుగా క్యారు మన్నది.


ఆ పాప ఉయ్యాల తొట్టిలో ఊగుతూ గూటిలో వున్న గణేశవిగ్రహాన్ని చూసుకుంటూ నవ్వులతో కేరింతాలు కొడుతూ ఆడుకొనేది.


ఆ పిల్లకు సుందరి అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగా సుందరి గొప్ప సౌందర్యవతిగా పెరిగి పెళ్ళియీడుకువచ్చింది. సుందరికి సౌందర్యంతో బాటు గొప్ప బుద్ధి, తెలివితేటలు, అందరికీ హితవు కూర్చే మాటతీరూ కలిగి ఉండటం చూసి, అమెను జ్ఞానసుందరి అన్నారు.


సుందరి అసమాన సౌందర్యం గురించి ఊరూరా చెప్పుకోసాగారు. శాపవశాన పుట్టిన గంధర్వకన్య అనీ, భూమ్మీద అవతరించిన దేవసుందరి అనీ అన్నారు. ఆమె పాణిగ్రహణానికి గొప్ప ధనసంపన్నులూ, అధికార బలంగలవారూ అసంఖ్యాకులుగా సుందరి తలిదండ్రులను ఒత్తిడి చేశారు. సుందరి గురించి విన్న ఆ రాజ్యమేలే మహారాజే, ఆ కన్యకా రత్నాన్ని తన రాణివాసానికి తీసుకుపోడానికి పరివారంతో రాజధాని నుండి బయలుదేరి వస్తున్నాడని తెలిసింది.


సుందరి ప్రతినిత్యమూ ఆరాధించే నదీ ఘట్టాన ఉన్న విఘ్నేశ్వర శిలావిగ్రహం ముందు మోకరిల్లి, కన్నులు మూసి నమస్కరిస్తూ, “విఘ్నేశ్వరా! శైశవం నుంచీ నిన్నే నమ్మినదాన్ని, సంసారంలో కొట్టుకుపోవడం నాకు యిష్టం లేదు. నన్ను ముసలిదాన్ని చెయ్యి! జ్ఞానసంపద నాకు అనుగ్రహించు! పుట్టినందుకు ప్రయోజనకరమైన పని నా చేత చేయించు!” అని ధ్యానిస్తున్న ఆమె నల్లని కొప్పు వెండిలాగ మెరుస్తూ నెరిసింది. పాలబుగ్గలు సొట్టలు సొట్టలు పడ్డవి. నుదురు అడ్డంగా ముడుతలు దేరింది. నదికి వచ్చినవారంతా నివ్వెర పోతూ చూస్తున్నారు. అమ్మాయి అవ్వ అయింది.


“అమ్మాయి సుందరీ! ఏమిటమ్మా ఇది?” అంటూ కంటనీరు పెట్టు కొంటున్న తండ్రి, తల్లితో, “నేను అమ్మాయినీ కాను, సుందరినీ కాను, అవ్వను! మీరు సంతోషించడానికి బదులు విచారిస్తారెందుకు? మీరిచ్చిన జన్మను సార్ధకంగా చేసుకొనే అవకాశాన్ని గణేశుడు అనుగ్రహించాడు. నా కంటే అజ్ఞానులైన వారికి నాకు తెలిసిన హిత వచనాలు చెప్తాను. జ్ఞానులైన వారి నుండి తెలియనివి తెలుసుకుంటాను. అజ్ఞాన దశలో ఉన్న వారంతా పసిపిల్లలవంటివారే. అంతా నా పిల్లలే. వారికి నేను అవ్వను!


నా పుట్టిన రోజు యీ రోజేకద, ఇదే నా పండగరోజు! పదయాత్రకు బయలుదేరుతున్నాను, నన్ను ఆశీర్వ దించండి!” అని అవ్వ అంటూ అక్కడ పడి ఉన్న చెట్టుకొమ్మను ఊతకర్రగా పట్టుకొని లేచి నిలబడింది.


అప్పుడే అక్కడికి చేరుకున్న రాజును చూసి అవ్వ, “ప్రజల ధన ప్రాణ గౌరవాలను కన్యలను రక్షణలో ఉంచవలసిన నువ్వే, ఒక కన్యను ఎత్తుకుపోవచ్చావు. ఊళ్ళు, ఇళ్ళు దోచుకొనే దండునాయకుడివా? రాజువా?” అని అడిగింది.


సిగ్గుతో సగం చచ్చిపోయిన మహారాజు కత్తినీ, కిరీటాన్ని తీసి దూరంగా పెట్టి, అవ్వ పాదాలకు ప్రణమిల్లి, “మహాత్మురాలా! నీ దర్శనంతో నా అజ్ఞానం తొలగింది. నేను నా రాజసాన్ని వదిలి ప్రజకుసేవకుడిననుకుంటూ వర్తిస్తాను!”అన్నాడు.


కారణజన్మురాలని అంతా అవ్వను కీర్తిస్తుండగా బయలు దేరుతున్న అవ్వను పల్లకి లో సంచారం చేయవలసిందనీ, సర్వవిధ ప్రయాణ సౌకర్యాలు అమర్చుతాననీ రాజు ప్రాధేయపడ్డాడు.


అవ్వ నిరాకరించి, “రాజా! చెప్పులకు కూడా నోచుకోని అతి సామాన్యులైన కష్టజీవుల మధ్యకు అందల మెక్కి వెళ్ళి ఏ మొగంతో నీతులు బోధించగలను? నువ్వు ప్రజకు విద్యా సౌభాగ్యాలను చేకూర్చు, నీ పని నువ్వు చెయ్యి! నేను సామాన్యురాలిగా, సామాన్యులందరితో ఒకటిగా నేను చేయగల్గినది. చేసుకుపోతాను. విఘ్నేశ్వరుడు, అతని ముద్దుల తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నీ చూసుకుంటారు. వారే నాకు రక్ష!” అని చెప్పింది.


అవ్వ కర్ర ఊతగా కాలినడకను బయలుదేరి, జ్ఞానపీఠమైన ఒక మఠాన్ని చేరుకొంది. పీఠాధిపతికి మ్రొక్కి, “అయ్యా! నాకు జ్ఞానం ఉపదేశించండి!” అని కోరింది.


పీఠాధిపతి సంశయిస్తూ, “అమ్మా! నువ్వు స్త్రీవి, జ్ఞానోపదేశం పొంది ఏం ప్రయోజనం?” అన్నాడు.


అవ్వ, “నీరూ, దీపమూ మగవాడికే గాని స్త్రీకి ఉపయోగపడవా? ఉపయోగించలేదా? గ్రుడ్డివాడి చేతనున్న దీపం ఇతరులకు దారి చూపించగలదు కదా! జీవిలో నేను అనే జ్ఞానస్వభావం మగదా? ఆడదా? ఏదీ కానిది, అన్నీ అయినది, అన్నిటా ఉన్నది ఒకటే అని అంటూనే పుట్టుక చేత ఎక్కువతక్కువలు, అర్హతలు ఎంచడం జ్ఞానుల పనేనా?” అని అన్నది.


పీఠాధిపతి, “మహాత్మురాలా! జ్ఞానపీఠంపై ఉండవలసింది. నేను కాదు, నీవే!” అని అన్నాడు.


అవ్వ, “పీఠాలు, మఠాలు ఎందుకు? అందరికీ తేలికగా అర్థమయ్యేలాగ దగ్గిరికెళ్ళి ఎక్కువమందికి జ్ఞానం అందించడం మంచిది కదా! పంచభక్ష్య పాయసాల రాజ భోజనం ఒకడికి పెట్టే కంటే, అంతా తినేది పదిమందికీ పెడితే కాదా!” అని అన్నది.


“ఔను! నేనూ అదే అనుసరిస్తాను,” అని శిరసు వంచి నమస్కరించాడు పీఠాధిపతి.


అవ్వ అలా వెళ్తూండగా ఒక మంచి నీటి బావి దగ్గిర నలుగురు స్త్రీలు నీళ్ళు తోడుకొని తీసుకెళ్లే విషయంలో ఒకామె చెప్తున్నది వింటున్నారు. ఆవిడ శాసిస్తున్నట్టు, “ఎవరు ముందు వచ్చినా, వెనక వచ్చినా నేను ముందు తోడుకెళ్ళాలి. తర్వాత ఈవిడగారు, తర్వాత ఆమె, ఆ తర్వాత ఆ మనిషి!” అని అంటున్నది.


దూరంగా ఒక బాలిక, “కాసిని నీళ్ళు పొయ్యండమ్మా. గొంతారిపోతున్నది!” అంటూ దీనంగా అరుస్తున్నది.


నలుగురు స్త్రీలు ఏక కంఠంతో, “దూరం, దూరంగా పోవే! యీ చాయలకు రాకు!” అంటూ కసిరినట్టు అరుస్తూండగా, చాలా దూరం ఎండలో నడిచి వచ్చిన బాలిక శోషిల్లుతూ పడిపోయింది.


అప్పుడు అవ్వ వెళ్ళి తన జారీ చెంబుతో బాలిక నోట్లో నీళ్ళు పోసి తాగించింది. మిగిలిన నీరు అవ్వ తాగి దాహం తీర్చుకుంది. అది చూచి నలుగురు స్త్రీలూ నోళ్ళు నొక్కుకుంటూ, “హవ్వ! ఎంత పనిచేశావు, అవ్వా! అది తాగగా మిగిలిన నీరు నువ్వు తాగుతావా! అది జాతి తక్కువది!” అన్నారు.


అవ్వ త్రేన్చి శాంతంగా, “శ్రీమతుల్లారా! అసలు జాతే లేనిదాన్ని నేను! అయితే ఆ పిల్లలో, నాలో నీళ్ళే నాళాల్లో ప్రవహిస్తున్నందువల్ల నీళ్ళే మమ్మల్ని సేద దేర్చాయి!” అంటూ కుతూహలంగా వెళ్ళి వాళ్ళ కడవ, బిందెల్లోకి చూసి ఆశ్చర్యంతో, “మీ శరీరం నిండా పాలే ఉంటాయనుకుంటున్నాను. మీకు నీకెందుకు? త్రాగడానికి కాదు గదా? అమ్మల్లారా! నీళ్ళు మాకు వదలండి, మీరు పాలే త్రాగండి!” అని అంటూ తన చెంబు నిండా నీళ్ళు పోయించుకున్నది.


నలుగురు స్త్రీలూ అవ్వ మాటల్లో దాగి ఉన్న సత్యాన్ని గ్రహించి బుద్ధి తెచ్చు కున్నారు.


అవ్వ అలా వెళ్తూండగా ఒక ఊళ్ళో జీవాల బలులు సాగుతున్నవి. జనం భయపడుతున్నట్లుగా దేవతకు మ్రొక్కుతున్నారు.


అవ్వ, “ఎంత అన్యాయం చేస్తున్నారే, తల్లీ! వాళ్ళేమో మాంసాన్ని మంచి రుచులతో వంట చేసుకొని తింటారు, నిన్ను పచ్చి నెత్తురు తిని బతికే క్రూర జంతువుగా అవమానిస్తున్నారు. తల్లిని అవమానించే పిల్లలైపోయారు వీళ్ళంతా!” అని అంటున్న మాటలు జనం విని, “అపచారం! అపరాధం! అమ్మ తల్లికి ఆగ్రహం వస్తే అంతా మసి చేస్తుంది!” అంటూంటే, అవ్వ, “లంచం పెట్టలేదని ఏ తల్లైనా పిల్లల్ని చంపుతుందా? మీరు ఊరికే భయపడుతున్నారు. అంతే! భయాన్నే భక్తి అనుకుంటున్నారు! మీ కోరికల్ని అమ్మకు అంటగట్టుతున్నారు! నిజమైన భక్తి అమ్మ మీద మీకు కలిగిన నాడు మీకు భయమూ ఉండదు, ఆపదలూ ఉండవు!” అని చెపుతూ వారికి అర్థమయ్యేలాగ భక్తి మార్గాన్ని ఉపదేశించింది.

--(ఇంకా వుంది)

Post a Comment

Previous Post Next Post