విఘ్నేశ్వరుడు (చందమామ)_07 Vignaeswarudu Novel (CHANDAMAMA)

 విఘ్నేశ్వరుడు (చందమామ) 

Vignaeswarudu Novel (CHANDAMAMA)

7. వేయి విఘ్నాలు


ఒక నాడు నారదుడు కైలాసానికి వెళ్ళుతున్న దారిలో కంటకముఖి అనే ఒక యక్షిణి పరిహాసంగా, “నన్ను పెళ్లాడవయ్యా, నారదా! బ్రహ్మ చెర తప్పించు కోవయ్యా, బ్రహ్మకొడుకా!” అని అన్నది.


నారదుడు, “నేను కలహ భోజనుడిని. కలహం వండి పెట్టగలది దొరకాలి గదా!” అన్నాడు.


“నేను, నీ కంటే జగడాలమారిని!” అంది యక్షిత.


ఆ సమయంలో విఘ్నేశ్వరుడూ, కుమారస్వామీ చెట్టాపట్టాలేసుకొని వస్తున్నారు. నారదుడు, “ఆ వస్తున్న అన్న తమ్ముళ్ళ మధ్య జగడం తేగలవా?” అన్నాడు.


“ఓష్! అదెంత!” అని కంటక  ముఖి పక్కనున్న దళసరోవరంలోకి దూకి బంగారు తామరపువ్వుగా మారి, “పార్వతీ పరమేశ్వరుల సుపుత్రుడి కోసం వికసించాను,” అంటూ కిన్నెర మీటుతున్నట్లు పాట మొదలు పెట్టింది.


అన్నదమ్ములిద్దరూ దాన్ని పట్టుకొని నాది, నాది అని వాదులాడుతూ, “అమ్మ చేసిన బొమ్మవు నీవు. మురికి ముద్దవు!” అని కుమారస్వామి విఘ్నేశ్వరుజ్జి ఆక్షేపిస్తే, “నువ్వు మురికిగుంట శరవణ సరస్సులోంచి వచ్చావు!” అని విఘ్నేశ్వరుడు కుమారస్వామిని ఎత్తిపొడిచాడు.


కుమారస్వామి పిడికిలి బిగించి పొడవ బోయాడు. విఘ్నేశ్వరుడు తొండంతో అతనిచేతి మణికట్టు బిగించాడు. ఇద్దరూ కలబడ్డారు. వినాయకుడు కుమారస్వామి నడుము తొండంతో బిగించి పైకెత్తాడు. కుమారస్వామి పైనుంచి బళ్ళాన్ని విఘ్నే శ్వరుడి బొజ్జాకు గురి పెట్టాడు.


నారదుడు పరుగు పరుగున వచ్చి వారి కలహాన్ని నివారించి,“మీరిద్దరూ ఏదేనా పందెం పెట్టుకోండి,” అన్నాడు.


కుమారస్వామి ఆలోచించి, “ఎవరు విశ్వాన్ని చుట్టి ముందువస్తే వారిదీ స్వర్ణ కమలం!” అన్నాడు.


“బాగుంది,!” అన్నాడు నారదుడు. కుమారస్వామి వెంటనే నెమలి మీద విశ్వప్రదక్షిణానికి ఎగిరి వెళ్ళాడు.


విఘ్నేశ్వరుడు చతికిలబడి నిట్టూర్చగా నారదుడు, “ఏం విఘ్నేశా! నీ సంగతే మిటి?” అన్నాడు.


విఘ్నేశ్వరుడు. “ఎవరికెంత ప్రాప్తో అంతేగాని స్వర్ణకమలం నాకు రమ్మంటే వస్తుందా, నారదా! నా బొజ్జతో, చిట్టెలుక వాహనంతో, నే నెక్కడ? విశ్వప్రదక్షణ ఎక్కడ? తమ్ముణ్ణే తీసుకోని కమలం!” అన్నాడు.


నారదుడు, “విఘ్నపతీ! విశ్వజననీ జనకులైన పార్వతీపరమేశ్వరులను దర్శిద్దామని వచ్చాను గానీ మళ్ళా వస్తాను.” అని చెప్పి వెళ్ళాడు.


విఘ్నేశ్వరుడు చప్పున లేచి వెళ్ళి, ఒక తిన్నెపై కూర్చున్న పార్వతీ శివుల చుట్టూరా ముమ్మారు ప్రదక్షిణ చుట్టి తమ్ముడిరాకకు ఎదురు చూస్తూ నిలబడ్డాడు.


చాలా సేపటికి ముప్పతిప్పలుపడి విశ్వ ప్రదక్షిణం చేసిన కుమారస్వామి నెమలి వాహనం దిగాడు. విఘ్నేశ్వరుడు తమ్ముణ్ణి కౌగలించుకొని, “తమ్ముడా, పాపం చాలా శ్రమలుపడి విశ్వం చుట్టి వచ్చావు; స్వర్ణకమలం నువ్వే వెళ్ళి తీసుకో. గెలవడం నేనే గెల్చాను గాని, నా కది అక్కర్లేదులే!” అన్నాడు.


కుమారస్వామి నివ్వెరపోతూ, “అదేలాగ?” అన్నాడు.


“నీ కంటే ముందు నేనే ముమ్మారు విశ్వప్రదక్షిణ చేసి నిలబడ్డాను, ఎవర్నడుగుతావో అడుగు!” అన్నాడు విఘ్నేశ్వరుడు.


“విఘ్నేశ్వరుడే గెల్చాడు!” అని ఆకాశవాణి ముమ్మారు పలికింది.


కుమారస్వామి నిజం తెలుసుకొని, వినాయకుడి ముందు మోకరిల్లి, “అన్నా! నేను పెద్ద తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొందానే కాని, చిన్న విషయంలో అజ్ఞానంలోనే పడ్డాను. నువ్వు కుశాగ్ర బుద్ధివి. నీ ముందు నేను ఎంత, నీ తరువాత వాణ్ణేగద! తారకాసురుడి పై యుద్ధానికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు!” అన్నాడు.


విఘ్నేశ్వరుడు కుమారస్వామిని లేవదీసి, “తమ్ముడూ! నేను పెద్ద అనీ,  నువ్వు చిన్న అనీ అనుకోవద్దు, నీవు కారణ జన్ముడివి! నీవు అన్నట్లుగా అమ్మ ఏదో ఆటగా చేసిన బొమ్మనే నేను; నీ కోసమే పార్వతీశివుల కళ్యాణం జరిగింది. వారి అనురాగఫలానివి! నీకు విజయం ఎప్పుడో రాసి పెట్టే ఉంది. తారకాసురుడు నీ చేతనే చావాలని వరం కోరుకున్నాడు. నీవు సుబ్రహ్మణ్యేశ్వరుడివి! నాకు అన్ని చోట్లా మామూలు గుళ్లు ఉంటాయి గాని, నీకు కొన్ని ప్రాంతాల్లో గొప్ప క్షేత్రాలు, పెద్ద పెద్ద ఆలయాలు, గోపురాలు ఉంటాయి. ప్రముఖ దైవమూర్తిగా ఆరాధింపబడతావు. శీఘ్రంగా వెళ్లి తారకాసురుడి బెడద వదిలించు!” అన్నాడు.


కుమారస్వామి దేవతలకు సేనాధిపతిగా తారకాసురుడిపై దాడికి వెళ్ళాడు.


యక్షుల అధిపతి కుబేరుడు కంటక ముఖిని పట్టి తెప్పించి, “ఓసీ, మాయల మారి పాపిష్ఠిదానా! శివుడి కుమాళ్ళకే కలహం పెట్టావు, పల్లేరు వైపడి ఉండు!” అని శపించాడు.


కంటకలత ప్రాధేయపడగా, విఘ్నేశ్వరుడి అనుగ్రహంవల్లనే శాపం తొలగుతుంది అని చెప్పాడు, కుబేరుడు. కంటకముఖి పల్లేరు ముళ్ల డొంకగా భూమ్మీద మొలిచింది.


కుమారస్వామి దేవతలకు సేనా నాయకుడై తారకాసుర నిర్మూలన చేశాడు. అతనికి దేవేంద్రుని కుమార్తె దేవయానను ఇచ్చి వివాహం జరిపించడానికి సర్వ సన్నాహాలు చేయబడ్డాయి గాని, అన్నకు కానిదే తమ్ముడికెలాగ చేయడం అన్నారు.


పార్వతి విఘ్నేశ్వరుడితో, “ప్రియనందనా! తమ్ముడి పెళ్ళి జరగాలంటే నువ్వు పెళ్ళి చేసుకోవడం నీ ధర్మం!” అన్నది.


“ఎందుకమ్మా! ఇలాంటి అర్థం లేని నియమాలు? ఎవరి యిష్టానుసారం వారు చేసుకోకుండా తోక తెగిన నక్క సామెతగా నా లాంటి ఏకదంతుల్ని, ఏకాంతుల్ని రొంపిలోకి దింపటం మంచిది అనిపించు కోదు.” అన్నాడు విఘ్నేశ్వరుడు తొలి విఘ్నంగా.


విఘ్నేశ్వరుడు యిలా ఎన్నోసాకులూ, విఘ్నాలు కల్పించుకొంటూ వచ్చాడు.


ఒక సారి చాలా పట్టుదలతో పార్వతి పెళ్లి చేసుకోమని తొందర పెట్టింది. “అమ్మా! నేను తపస్సు చేయాలి! తమ్ముడు చేశాడు గాని నేను చేయలేదుగా,” అని విఘ్నేశ్వరుడు తపస్సుకి బయలుదేరాడు.


ఇంద్రుడు అప్సరసలందర్నీ విఘ్నేశ్వరుడి తపోభంగం చేయండని పంపాడు. అర్క అనే ఆప్సర నిరాకరించింది. ఇంద్రుడు, “నువ్వు మాలకాకివి, అంట రాని జిల్లేడు వై భూమ్మీద మొలు!” అని శపించాడు.


విఘ్నేశ్వరుడు తపస్సు చేయడానికి అనువైనచోటు వెతికి వెతికి ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశంలో పల్లేరు డొంకలు నేలంతా విస్తరించి ఉన్నాయి. జిల్లేడు పొదలు మొగ్గలు నిండుగా తొడిగి విచ్చుకుంటూ వున్నాయి. విఘ్నేశ్వరుడు తపస్సు సాగిస్తున్నాడు. అప్సరసలు అక్కడకు

చేరి నాట్యం మొదలు పెట్టారు. వాళ్ళ కాళ్ళకు పల్లేరు కాయ ముళ్ళు గుచ్చుకొని పడిపోతుంటే ఒంటినిండా పల్లేరుముళ్ళు గుచ్చుకుంటూంటే మూలుగుతూ ఆర్తనాదాలు చేశారు. విఘ్నేశ్వరుడికి ధ్యానభంగమై జరిగింది చూశాడు. పల్లేరు తీగపట్ల అభిమానం కలిగింది. అప్సరసలు భయంతో పడుతూ లేస్తూ కుంటుకుంటూ పారిపోయారు. పల్లేరుగా

మొలిచిన యక్షిణి కంటకముఖి, “స్వామీ! మీ అన్నతమ్ముళ్ళకు తగువు పెట్టి కుబేరుడి శాపం పొంది ఇలా పడి ఉన్నాను, అనుగ్రహించు!” అని వేడుకుంది.


ఆ రోజు సరిగా భాద్రపద శుక్ల చవితి, వినాయక చవితి రోజే. విఘ్నేశ్వరుడు కంటకముఖి శాపం తొలగించి, “వినాయకచవితినాడు నీ పల్లేరు ముళ్ళ కాయలను వికటవినోదంగా ఉపయోగిస్తారులే!” అని చెప్పాడు.


యక్షిణి అలకాపురి చేరుకుంది. అప్పుడు జిల్లేడు, “స్వామీ! నన్ను కూడా అనుగ్రహించండి. ఇంద్రుడి ఆజ్ఞ నిరాకరించి శాపం పొంది అంటరానిదాన్నిగా ఇలా పడి ఉన్నాను. నేనెందుకూ కొరగానిదాన్ని, అర్క అనే అప్సరసను, నీయందు భక్తి శ్రద్ధలు గలదాన్ని!” అంది.

విఘ్నేశ్వరుడు జిల్లేడుతో. “అంట రానితనం అంటూ ఏదీ సృష్టిలో లేదు.

నీ మొగ్గల్ని, పువ్వుల్ని నేను ప్రీతితో మాలగా ధరిస్తాను! నీవు ద్వాపర యుగంలో కుబ్జవై పుడతావు, కృష్ణుడు నిన్ను ఏలుకుంటాడు, నీ శాపం పోయింది. సుఖంగా స్వర్గం వెళ్ళు. ఇంద్రుడి వల్ల గాని మరెవ్వరివల్ల గాని నీకెటు వంటి భయమూ ఉండదు, ఏ శాపమూ తగలదు. జిల్లేడు వేళ్ళు ఆయుర్వేద ఔషధాలకు ఉపయోగపడతాయి, జిల్లేడాకులు సూర్యుడికి ప్రీతిగా ఉంటాయి!” అని చెప్పాడు.


అర్క అప్సర రూపంతో స్వర్గాన్ని చేరుకుంది.


విఘ్నేశ్వరుడు కైలాసానికి తిరిగి వెళ్ళాడు. “నాయనా, తపస్సు ముగిసింది కదా, మరి పెళ్ళీ.........” అని, పార్వతి అంటూండగా, “ముగియడమేమిటి? అసలు జరగనేలేదు, తిరిగి తపస్సు కెళుతున్నా!” అని చెప్పి విఘ్నేశ్వరుడు మరో చోటు ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశమంతా పాములపుట్టల మయంగా ఉంది. చుట్టూ పలయంగా పుట్టలున్నట్టు చూసుకొని తపస్సు మొదలు పెట్టాడు. పుట్టల్లోంచి పాములు నిటారుగా లేచి పడగలు విప్పి బుసలుకొడుతూ కాపలా కాయసాగాయి. ఇంద్రుడు మూషికాసురుడి అనుచరులైన రాక్షసులకు, “మీ యజమానిని వాహనంగా చేసుకొన్న విఘ్నేశ్వరుడు మిమ్మల్నందర్నీ నిర్మూలించడానికి తపస్సు చేస్తున్నాడు. పగ తీర్చుకోండి!” అని కబురు పెట్టి ఉసిగొల్పాడు.


రాక్షసులు వినాయకుడి మీద దాడి చేయగా మహాసర్పాలు పాతాళం నుంచి కట్టలుగా వచ్చి వాళ్ళ పొగరు అణిచాయి. చచ్చిన వాళ్ళు చావగా మిగిలినవాళ్ళు తమ తెలివి తక్కువను నిందించుకొంటూ ఇంద్రుణ్ణి తిడుతూ అక్కడి నుంచి పారిపోయారు.


ఇంద్రుడు మంచి ఉల్లాసవంతులైన దేవతా పురుషుల్ని, వారితో అప్సరసలను కలిపి పంపుతూ, “విఘ్నేశ్వరుడికి రాగోదయం కలిగేలాగ మీ ప్రతాపం చూపండి!” అని ఆజ్ఞాపించాడు. వాళ్ళ వెనుకనే వజ్రాయుధం పట్టి వెళ్ళాడు.


దేవతలు అప్సరలతో జంట జంటలుగా సుర సేవిస్తూ కోలాహలంచేస్తూ ఆటపాటలు మొదలు పెట్టారు, నాగులు బుసకొడుతూ విరుచుకుపడి వాళ్ళను చుట్టుకొని కోరలతో కాట్లు వేయసాగాయి. ఇంద్రుడు నాగులపై వజ్రాయుధాన్ని ఝళిపించాడు. నాగుల కోపం రెచ్చిపోయింది. నాగలోకం నుంచి బిలబిలమని మహా సర్పాలన్నీ వచ్చి దేవతల్ని స్వర్గానికి తరిమాయి. దేవతలకూ నాగులకూ చిన్న యుద్ధం లాంటిది జరిగింది. ఇంద్రుడి వజ్రాయుధాన్నే లక్ష్య పెట్టకుండా నాగులు స్వర్గాన్ని ముట్టడించి గగ్గోలు పుట్టించి మరీ వెళ్లాయి. విఘ్నేశ్వరుడు నాగుల సహాయానికి సంతసించి పాములను ఎత్తుకొని ముద్దాడి, అలంకారాల్లాగ మీద వేసుకొని కైలాసానికి వెళ్ళాడు.


పార్వతి అతని పాముల వాడివాలకం చూసి నివ్వెరపోయింది. “అమ్మా! తండ్రి సొత్తు తనయుడికి సంక్రమించడం సహజమైందేగదా! శంకరాభరణాలు నాకు భూషణాలే! అదీ గాక పాములు నాకు ప్రాణ మిత్రులై ప్రాణాలకు తెగించి కాపు కాశాయి. ఆప్తమిత్రుల అండదండలే కదా నిజమైన దండకడియాలూ, అమూల్యాభరణాలూను! అందుకే నాగభూషాయ అనిపించుకున్నాను!” అని విఘ్నేశ్వరుడు చెప్పాడు.


శివుడు చిరునవ్వులు ఒలికించాడు. పార్వతి వినాయకుడి వింత చేష్టలకు విసుక్కుంది. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలు తెచ్చి పెట్టుకుంటూ వచ్చాడు.


పార్వతి మళ్ళీ మరొక సారి బలవంత పెట్టింది. “అమ్మా! ఏదైనా ఘనకార్యం చేస్తేనే గదా సమర్దుడనిపించుకుంటారు! నేనేదైనా చేసి తమ్ముడి లాగ ఘనుడిననిపించుకోనిదే ఎలాగ పెళ్లి చేసుకోమంటావు?” అన్నాడు విఘ్నేశ్వరుడు.


“నీకేంతక్కువ నాయనా? సమర్ధుడివికాక వాజమ్మవా ఏమిటి!” అంది పార్వతి.

--(ఇంకా వుంది)


Post a Comment

Previous Post Next Post