విఘ్నేశ్వరుడు (చందమామ)_06 Vignaeswarudu Novel (CHANDAMAMA)

 విఘ్నేశ్వరుడు (చందమామ) 

Vignaeswarudu Novel (CHANDAMAMA)

6. కుమారస్వామి జననం


“విఘ్నేశ్వరా! ఇప్పుడు నీవు చేసిన గజాసుర నిర్మూలన జ్ఞాపకంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కలకాలం ఘనంగా జరుగుతూంటాయి. ముందు కాలంలో ప్రజల స్వేచ్ఛ, శ్రేయస్సుల కోసం సాగే ఉద్యమాలు గణేశ ఉత్సవాలతో జయ ప్రదంగా కొనసాగి ఫలిస్తాయి. ఉత్సవాలన్నిటికీ గణపతి నవరాత్రి ఉత్సవం తిలకంగా ఉంటుంది!” అని ఆకాశవాణి పలికింది.


విష్ణువు విఘ్నేశ్వరుడితో, “పార్వతీ నందనా! మేనల్లుడివని చెప్పి నాకు మరొక పని కూడా కల్పించావా!” అన్నాడు.


విఘ్నేశ్వరుడు, “మేనమామ వరస పెట్టి కాలనేమి అయిన కంసుణ్ణి మేనమామ గండాన నువ్వెలాగూ పుట్టి, చంపు తావుగదా! ఇలాంటి వరసలన్నీ నీవు నేర్పిన విద్యలేగదా నీరజాక్ష!” అన్నాడు.


విష్ణువు, “విఘ్నవినాశకా! నీ పరశువు ముందు, నా చక్రాయుధం ఏపాటి? నీ గొడ్డలిసాము చూసినప్పుడు మహ ముచ్చటేసింది సుమా!” అన్నాడు.


“పరశురామావతారంలో నా గొడ్డలి ఎరువు తీసుకెళ్ళి గర్వపోతులైన క్షత్రియుల్ని తెగనరుకుదువు గానిలే!” అన్నాడు విఘ్నేశ్వరుడు.


విష్ణువు, “గజవిఘ్నాసురుడి మీద ఎక్కి మర్దిస్తున్నప్పుడు నీ బుడిబుడి నడకల గుజ్జు రూపం కూడా నన్నెంతో మురి పించిందోయి!” అన్నాడు.


“అలాగైతే, వామనుడివై బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కుదువు గానిలే!” అని విఘ్నేశ్వరుడు అన్నాడు.


“నీ బుద్ధి విశేషం కూడా నన్ను అమితంగా ఆకర్షించుతోంది, ఏం చెయ్యను,” అని విష్ణువు అనగా, విఘ్నేశ్వరుడు, “ఏ యుగానికి అవసరమైన ధర్మాన్ని ఆ యుగంలో స్థాపించడమే గదా, నీ అవతారాలకు మూల కారణం! ధర్మసంస్థాపనకు, అసలు అర్థం, సంఘం హింసతో, మూఢాచారాలతో కుళ్ళిపోతున్న రోజుల్లో బుద్ధుడవై మానవులకు సక్రమ సంఘజీవనాన్ని, నిర్వాణాన్ని భోధించుతావులే! మాయాదేవి స్వప్నంలో నా తెల్లని ఏనుగు రూపం గర్భంలో ప్రవేశించి బుద్ధుడైన సిద్ధార్థుడి అవతారానికి నాంది పలుకుతుంది!” అని చెప్పాడు.


విష్ణువు మహదానందం పొందాడు.

పరమాణు రూపంలో ఉన్న విఘ్నం, “విఘ్నరాజా, నీ బానిసను, నీ ఆజ్ఞానువర్తిని, వెళుతున్నాను,” అని శలవు తీసుకొని కాళింది మడుగు చేరి కాళీయుడుగా దాక్కుంది.


విఘ్నం వెనుకనే మూషికాసురుడు మూషిక రూపంతో వచ్చి ప్రచ్ఛన్నంగా దాగి, విఘ్నానికి పట్టిన గతి చూసి పట పట పళ్ళు కొరికి, నిజరూపంతో బోర విరుచుకొని విఘ్నేశ్వరుడి ముందు నిలబడి సింహనాదం చేశాడు.


విఘ్నేశ్వరుడు బలిష్ఠమైన అతని శరీరాన్ని సంతృప్తిగా చూశాడు. మూషికాసురుడు నిర్లక్ష్యంగా విషపునవ్వు నవ్వుతూ, “విఘ్నం నీ బానిస కనుక ఏం చేసినా చేశావు గాని, నేను నీ జన్మవిరోధిని. సింహస్వప్నం అనే మాట వినే ఉంటావు, సింహాన్నై నీ కుంభస్థలాన్ని చీలుస్తాను!” అని అంటూ సింహంగా మారి పెద్దగా గర్జించాడు.


విఘ్నేశ్వరుడు, “సింహమా! నువ్వు జగజ్జనని వాహనానివి, నిన్ను గౌరవిస్తున్నాను!” అన్నాడు.


సింహం మళ్ళీ గర్జించి ఉరకబోతూంటే, విఘ్నేశుడు, “శివా, శరభా!” అని స్మరించాడు.


సింహానికి ఎదురుగా శివుని శరభావతారం ఘీంకార గర్జనలు చేస్తూ నిలిచింది. శరభానికి సింహశరీరము, కేసరాలు, కోరలు ఉంటూ ఏనుగు తొండమూ, దంతాలు ఉన్నాయి. మహా సర్పంలాంటి తోక చివర జ్వాలలు కక్కే మకర ముఖము ఉంది. శరభం జూలు అగ్నిశిఖల్లాగా ఎగురుతున్నాయి. శరభం తొండంతో సింహం ముఖం వాచేలా కొట్టింది. సింహం తోకముడిచి పరుగు తీసింది. శరభావతారం మాయమైంది.


విఘ్నేశ్వరుడు తొండాన్ని యోజనం పొడవున సాగదీసి సింహం నడుము చుట్టి పట్టి ఎత్తాడు. సింహం కిరకిర లాడింది. ఆ సమయంలో ఆకాశగమనం చేస్తున్న నారదుడు 'సా' అని గొంతు సాగదీస్తూ, “సామజ వరవదనా!” అంటూ హిందోళ రాగాన్ని ఆలాపించాడు.


దేవతలు గుమిగూడి ఆకాశం నుండి వింత చూస్తున్నారు. విష్ణువు, “విజయ విఘ్నేశ్వరా! నువ్వు పట్టిన సింహాన్ని పెంచుకుంటాను, యివ్వవూ?” అన్నాడు. 


విఘ్నేశ్వరుడు నవ్వి, “పెంచినట్టే పెంచి తలా, గోళ్ళూ తీసుకొని నరసింహావతారం ఎత్తి హిరణ్యకశ్యపుణ్ణి చీలుద్దామనా? అదేం కుదరదు. ఈ మృగరాజు అవసరం నాకు ఉంది, నీ నరసింహావతారం నీవు చూసుకోవలసిందే!” అన్నాడు.


తొండం మూషికాసుర సింహాన్ని తిన్నగా తీసుకెళ్ళి మహాశ్వేత ముందు విడిచి అదృశ్యమైంది. మహాశ్వేత భర్తకు హితవు చెప్పినా వినకుండా నిజరూపంతో విఘ్నేశ్వరుడితో ఢీకొనడానికి పరుగు తీశాడు. మహాశ్వేత దేవిని ప్రార్ధించింది. దేవి కనిపించి, “నీ భర్త విఘ్నేశ్వరుడికి ఎలుక వాహనంగా చిరంజీవిగా ఉంటాడు. అలా రాసి పెట్టి వుంది. నీవు కూడా శ్వేత ఛత్రానివై నీ భర్తతో బాటు కలకాలం విఘ్నేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటావు!” అని చెప్పి అంతర్ధానమైంది.


వజ్రదంతుడు కామరూపి గనుక, ఈసారి ఏనుగుల్ని తన్నుకుపోగల గండభేరుండ పక్షి రూపంతో, దారిలో కనిపించిన రెండు ఏనుగుల్ని గోళ్ళతో పట్టుకుని ఎగిరి వెళ్తూండగా చెలరేగిన అలజడికి, చిన్న గ్రద్దరూపంతో ఒక చెట్టు మీద హరిని ధ్యానిస్తూ ఉన్న గరుత్మంతుడికి ధ్యాన భంగమైంది. కోపంతో గ్రద్ద గండభేరుండాన్ని ముక్కుతో పొడిచింది. ఆ పోటుకు వజ్రదంతుడు నిజరూపంతో నేల కూలాడు.


గరుత్మంతుడు, “ఇంతకంటె రుచికరమైన ములుకుపోట్లు తినబోతున్నావు, వెళ్ళు!” అంటూ ఎగిరిపోయాడు.


మూషికాసురుడు వెళ్ళి విఘ్నేశ్వరుడితో, “నీకూ ఉన్నాయి, పెద్దదంతాలు, వెలక్కాయలు నొక్కి తినడానికి తప్ప మరెందుకూ పనికిరావు. నా దంష్ట్రటలతో వజ్రాల్ని పిండి చేస్తాను, కైలాసాన్ని గుల్ల చేస్తాను, తెలుసునా!” అన్నాడు.


వినాయకుడు దిక్కులు చూస్తూ, తనలో తాను గొణుక్కుంటూన్నట్లుగా, “ఔనౌను, ఎందుకూ కొరగాని దంతాలు ఉండి ఎందుకూ?” అంటూ ఒక దంతాన్ని పటుక్కున సగానికి విరిచి, పారేసినట్టుగా విసిరేశాడు.


ఆ దంతం గాలిలో గిర్రున తిరుగుతూ ఇంద్రజాలం ప్రదర్శించి వెళ్ళి వజ్రదంతుణ్ణి గుచ్చిగుచ్చి పొడవడం ప్రారంభించింది. రక్తం ధారలుకట్టి కారసాగింది. మహా శ్వేత అది చూడ లేక మూర్చ పోయింది. వజ్రదంతుడు చిన్న ఎలుక గా మారితుర్రున పారిపోయి రాళ్ళమధ్య కలుగు చేసుకొని దూరాడు. ఒక దంతాన్ని విరుచుకొని విఘ్నేశ్వరుడు ఏకదంతుడు అనిపించుకున్నాడు.


దంతం కూడా కలుగులో దూరి ఎలుకను అలా పొడుస్తూనే వెంబడించింది. తోక వెంట రక్తం జాడ కడుతుంటే ఎలుక సొరంగం దొల్చుకుంటూ పాతాళానికి , పాతాళం నుంచి భూమ్మీదకూ వచ్చి పరుగులు తీసి లోకమంతా చుట్టి చివరకు విఘ్నేశ్వరుడి శరణుజొచ్చి, “నాకా చావు రాదు. నీ దంతం గుచ్చిగుచ్చి చంపుతున్నది, బాధ తప్పించు దేవా!” అని వేడుకున్న మూషికాసురుడికి విఘ్నేశ్వరుడు అభయం యిచ్చాడు. దంతం వచ్చి అతని హస్తం అలంకరించింది.


విఘ్నేశ్వరుడు, “మూషికా! చూట్టానికి చిట్టెలుకవే గాని మహాబలుడివి. మహా కూర్మావతారంతో మంధరపర్వతాన్ని, ఆది వరాహావతారంతో భూమిని ఎత్తిన విష్ణువు కంటె బలశాలివి! తగిన వాహనం కుదరక నేను నా లంబోదరంతో నడవలేక అవస్తపడుతున్నాను. నీ లాంటి.....” అంటూ చెప్పడానికి సందేహిస్తున్నట్టు నసిగాడు.


విఘ్నేశ్వరుడి పొగడ్తకు మూషికాసురుడు పొంగిపోయి, “స్వామీ! నీ దంతం నా లోని అజ్ఞానాన్ని పారదోలి గుచ్చి గుచ్చి జ్ఞానాన్ని నింపింది. నీకు వాహనం కావడం నా భాగ్యంగా భావిస్తున్నాను,” అంటూ ఏనుగంత ఎలుక గా పెరిగాడు.


విఘ్నేశ్వరుడు దానిపై కాలు మోపి కూర్చోబోగా మహా మూషికం కీచుకీచు మంటూ అణుక్కుపోయింది.


విఘ్నేశ్వరుడు, “నాయనా మూషికా, నీవు చిట్టెలుకగా ఉంటేనే నన్ను సునాయాసంగా మోయగలవు. నా ఆకారానికి చిట్టెలుక వాహనమే అన్ని విధాలా అమరుతుంది,” అన్నాడు.


మూషికాసురుడు యధాప్రకారంగా చిట్టెలుకగా తగ్గిపోయాడు. విఘ్నేశ్వరుణ్ణి ఎక్కించుకొని చక చకా చుట్టూరా తిరుగుతూ, “ఔను స్వామీ! ఇప్పుడు నిన్ను మోస్తున్నట్టే లేదు!” అన్నాడు.


మూర్చనుండి తేరుకొన్న ధవళ విఘ్నేశ్వరుడికి నమస్కరించి, “దేవా! నా భర్త నీకు చిట్టెలుక వాహనంగా ఉంటాడు, నేను కూడా నీకు శ్వేతఛత్రమై ఉంటాను, ఈ వరం అనుగ్రహించు,” అన్నది.


విఘ్నేశ్వరుడు, “అమ్మా! నీ తెల్లని గొడుగు చల్లనినీడ నాకు రక్ష! నా భాగ్యం కొద్ది దొరికింది,” అంటూ ఎలుకను చూసి, “వజ్రదంతా, దేవి అనుగ్రహం పొందిన సాధ్వి ధవళ మాటకు తిరుగులేదు. నా వాహనంగా ఉండు, నాతో బాటే నాకు పెట్టేవన్నీ, నువూ తిను! అందరూ మొట్టి కాయలు పెట్టుకొని, మూడు గుంజీలు తీసి లెంపలేసుకుంటూంటే, తృప్తిగా ఉంటుంది. నా ముందు, నీ ముందు కూడా అలాగే అంతా చేస్తూంటారు!” అన్నాడు.


“ఔను దేవా! నేనూ అలాగే కోరదామనుకున్నాను. నేను వజ్రదంతుడిగా నా ముందర దేవతలచేత అలాగే చేయిస్తూండే వాణ్ణి. నీ వాహనాన్నై కృతార్థుడి నైయ్యాను!” అని మూషికుడు అన్నాడు.


ధవళ తెల్లని గొడుగుగా విఘ్నేశ్వరుడిపై నిలిచింది. ఆ దంపతులు చిరంజీవులై వినాయకుణ్ణి అలాగే సేవిస్తూ ఉంటారు. విఘ్నేశ్వరుడు మూషిక వాహనుడయ్యాడు.


విష్ణువు, విఘ్నేశ్వరుడితో, “ఏకదంతా! మూషికోత్తమ వాహనా! నీ

వాహనం చూస్తే నాకు అసూయగా ఉందోయి. ఎంత మంచి వాహనాన్ని సంపాదించావు!!,” అన్నాడు.


విఘ్నేశ్వరుడు, “నీ కల్కి అవతారంలో నా వాహనం నీకు తెల్లని గుర్రమై అంతరిక్షాన్ని దాటి గ్రహాంతరాలకు తీసుకెళ్తుందిలే! మానవులకు కొత్త వలస రాజ్యాలను సమకూర్చు!” అన్నాడు.


విష్ణువు, “ఆహాహా! నీ నోటి చలవ వల్ల అలాగే జరగాలి!” అని ఆనందించాడు.


నారదుడు, “విజయవిఘ్నేశ్వరా! ఇప్పటికి నీతో బాటే విష్ణువు తొమ్మిది అవతారాలు తెలిశాయి, ఒక్కటి మిగిలింది!” అన్నాడు.


విష్ణువు నారదుణ్ణి చూసి కన్ను గీటి, “త్వరలోనే ఆ కళ్యాణ ఘడియ వచ్చినప్పుడు అది తెలుస్తుందిలే! తొందరెందుకు,” అన్నాడు.


“ఎవరి కళ్యాణం దేవా?” అని అడిగాడు నారదుడు.


“మన కళ్యాణ చక్రవర్తి విజయ విఘ్నేశ్వరుడిదే!” అన్నాడు విష్ణువు.


విఘ్నేశ్వరుడు చిరుకోపంగా చూశాడు. “వెయ్యి విఘ్నాలు కల్పించుకోక తప్పదు!” అని గట్టిగా అనుకున్నాడు.


“నాయన్నాయన, అంతటితో సరి పెట్టు! వెయ్యి విఘ్నాలు పూర్తి అయ్యాక అరవిఘ్నం అయినా కల్పించుకోడానికి చెల్లేదిలేదు సుమీ!” అని విష్ణువు హెచ్చ రించాడు.


నారదుడు, “వెయ్యి విఘ్నాలనగా ఏ మాత్రం? వెయ్యి విఘ్నాల తర్వాత విఘ్నేశ్వరుడి పెళ్లి తప్పదు-తప్పదు!” సరిసరి మాగరి అని పాడుతూ ముల్లోకాలు తిరిగాడు.


శివుడికి పార్వతి పైగల మోహాను రాగం తేజస్సుగా మారింది. అగ్నిదేవుడు దాన్ని తీసుకెళ్ళి శరవణ సరస్సు చేరేలాగ చేశాడు. ఆరు ముఖాలతో కుమారస్వామి అవతరించాడు. ఆరుగురు ఋషి

భార్యలు అతణ్ణి పెంచి పార్వతీ పరమేశ్వరులకు అప్పగించారు. కుమారస్వామి పెరిగి పెద్దవాడైయ్యాడు. గరుత్మంతుడు అతనికి నెమలి వాహనం యిచ్చాడు. ఇంద్రుడు అతనికి ఎన్నో ఆయుధాల్ని ఇచ్చాడు. పార్వతి శక్తి బళ్లాన్ని ఇచ్చింది. కుమారస్వామి పెరిగి పెద్ద అవుతూంటే తారకాసురుడు తల్లడిల్లిపోతూ భయంతో పీడకలలు కనసాగాడు.


కుమారస్వామి గొప్ప తపస్సు చేసి బ్రహ్మజ్ఞానాన్ని విడమర్చి చెప్పి సుబ్రహ్మణ్యస్వామి అని పించుకున్నాడు. ఓంకారం గురించిన నిగూఢ రహస్యాల్ని శివుడంతటి వాడికే గురువై ఉపదేశిం చాడు. అన్నదమ్ములైన విఘ్నేశ్వరుడు, కుమారస్వామి కైలాసంలో పార్వతీ శివుల కనుల పండుగగా ఎంతో సఖ్యంగా ఆట పాటలతో విహరిస్తున్నారు.

--(ఇంకా వుంది)

Post a Comment

Previous Post Next Post