విఘ్నేశ్వరుడు (చందమామ)_03 Vignaeswarudu Novel (CHANDAMAMA)

విఘ్నేశ్వరుడు (చందమామ) 

Vignaeswarudu Novel (CHANDAMAMA)

3. పుత్ర గణపతి


తారకాసురుడి నిరంకుశత్వానికి తోడుగా, త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులు తపస్సులు చేసి వరాలు పొంది ఆకాశంలో ఎగురుతూ తిరిగే మూడు పట్టణాలను నిర్మించుకొని, ముల్లోకాల మీద విరుచుకుపడ్డారు. మూడు పురాల మీద ఎగురుతూ అగ్నిగోళాల్ని కురిపిస్తూ, పట్టణాలనూ, పచ్చని పల్లెలనూ తగల బెడుతూ విధ్వంసకాండ సాగిస్తున్నారు. జగత్తు అట్టుడికిపోతున్నది. వారిని అంత మొందించగలవాడు శివుడొక్కడే అని తెలిసిన దేవతలు అంతా కలసివచ్చి, మందిర ప్రాంగణంలో సూరెత్తి ప్రార్ధనలు చేశారు. పెళ్లాడిన కొత్తలో నే ఏదో బెడద వచ్చిందని శివుడు విసవిస లాడినా, త్రిపురాసురులు చేస్తున్న మారణ హెమం విన్న మీదట ఉద్రేకం పుట్టి మూలనున్న త్రిశూలాన్ని దుమ్ము దులిపి పట్టుకొని, తన అనుచరుల్నీ, ప్రమథగణాలనూ వెంటబెట్టుకొని, త్రిపురాసురులను తుదముట్టించడానికి కదిలాడు.


అదేసమయంలో జడల ఏనుగుగా మారి లోకాన్ని భీభత్సంచేస్తూ, ఒక రాక్షసరాజు బయలుదేరాడు. ఏనుగు రూపం కారణంగా అతడికి గజాసురుడు అన్న పేరు వచ్చింది. అతడు గొప్ప శివ భక్తుడు. శివుడి వల్ల తప్ప మరెవరివల్లా చావులేని వరం పొందాడు.


“శివుణ్ణి నీ లోపలే ఉంచేసుకొంటే మరీ మంచిది గదా!” అని నారదుడు గజాసురుడి మేలు కోరుతున్న వాడిలాగా అతడితో చెప్పాడు. గజాసురుడు వెంటనే ఉగ్రమైన ఆరాధనతో శివుణ్ణి గూర్చి తపస్సు మొదలు పెట్టి శివుణ్ణి మెప్పించాడు. త్రిపురాసుర సంహారానికని బయలుదేరిన శివుడు గజాసురుడి కోరిక ప్రకారం గజాసురుడి గుండెలో లింగ రూపంతో ఉండిపోయాడు.


“శివుడు గజాసురుడి గుండెలో ఉండి పోతే త్రిపురాసుర సంహారం ఎలా జరుగుతుంది? నవ వధువు పార్వతి ముచ్చట తీరేదెలా? శివుడికీ, పార్వతికి పుట్టవలసి ఉన్న వాడి వల్లనే కదా తారకాసురుడి అంతం జరగాలి?” అని దేవతలు అంతా దిగులు ముఖాలు వేస్తూంటే నారదుడు, “శివుడు ఉబ్బులింగడు కదా!” అని ఉపాయం అందించాడు. దేవతలంతా గజాసురుడి ఎదట శివుణ్ణి పొగుడుతూ స్తోత్రపాఠాలు మొదలు పెట్టారు.


గజాసురుడు కూడా తన్మయుడై వారితో కలిసి శివభజన సాగించాడు. శివలింగం ఉబ్బి అలా అలా పెరిగిపోతూ గజాసురుడిని చీల్చి వేసింది. శివుడు ఇవతల పడ్డాడు. గజాసురుడు కన్నుమూస్తూ, “నిన్ను నమ్ముకొంటే ఇలా చేశావేమిటి!” అని శివుణ్ణి నిందించగా, “గజా! శివ భక్తికి తార్కాణంగా కలకాలం నీ పేరు నిలిచేలాగ ఏనుగుతల నాకు సన్నిహితంగా ఉంటుంది. గజచర్మాన్ని కట్టుకుంటాను,” అని శివుడు చెబుతూ గజాసురుడిని తన లోకి తీసుకొని కై వల్యాన్ని ప్రసాదించాడు.


శివుడు భూమిని రధంగా, సూర్య చంద్రుల్ని రధచక్రాలుగా, వేదాలు గుర్రాలుగా, బ్రహ్మసారధిగా, మేరు పర్వతాన్ని ధనుస్సుగా, విష్ణువును బాణంగా సమకూర్చుకొని, తన అనుచరులైన నందీ, శృంగీ, భృంగీ మొదలైన ప్రమధ గణాలను వెంట వేసుకొని, ముక్కోటి దేవతలు వారివారి దేవేరులతో సహా వెనుక రాగా, భయంకరులైన త్రిపురాసురుల పై యుద్ధానికి వెళ్ళాడు.


ఇంట్లో వంటరి పార్వతికి కాలం బరువుగా గడుస్తున్నది. శివుడు ఎప్పుడు  వచ్చేదీ తెలీదు. ఆ సమయంలో నారదుడు వచ్చి, “అమ్మాయి పార్వతీ! శివుడు నిన్ను పెళ్ళాడినప్పట్నించీ తారకాసురుడు తల్లడిల్లిపోతూ పీడకలలు కంటున్నాడు . నీకు ఎలాంటి హాని తలపెడ తాడోయేమో. వాడికి వజ్రదంతుడు తోడై ఉన్నాడు. వజ్రదంతుడు బహుమాయావి! నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా!” అని హెచ్చరించి వెళ్ళాడు.


పార్వతికి మరింత చిరాకు, దిగులు కూడా కలిగాయి. చక్కగా తలంటు స్నానం చేస్తే చిరాకు తగ్గి బాగుంటుందనిపించింది.


పార్వతి నలుగు పెట్టుకొని, ఆ నలుగు ముద్ద కూడ దీసి, ఆ ముద్దతో ఒక బొమ్మ చేసి ముచ్చటగా చూసుకొని అలా కింద పెట్టి అటు తిరిగి ఇటు చూసేసరికి బొమ్మకు మారుగా ముద్దులు మూటగట్టే బాలుడు కనిపించాడు. “ఎవరబ్బా, నీవు?” అని పార్వతి అడిగింది.


“నీ కాంతిని పుణికి పుచ్చుకొని రాలిన నలుగుముద్దనే కదుటమ్మా! నీ పుత్రుణ్ణి, పుత్రగణపతిని!” అన్నాడు బాలుడు. పార్వతి బాలుణ్ణి అక్కున చేర్చుకొని ముద్దాడి, ఒక అంకుశ గదా దండాన్ని అతని చేతికిచ్చి, “నాయనా! ఎవ్వరినీ, పురుగునైనా రానీయకు!” అని చెప్పి సింహద్వారం దగ్గర కాపలా ఉంచింది.


“అమ్మా! తినడానికేమైనా పెట్టవూ,” అని అడిగాడు కుర్రవాడు. అప్పటి కప్పుడు పిండి కలిపి చలిమిడి ముద్దనూ, ఉండ్రాళ్ళనూ చేసి ఇచ్చి పార్వతి స్నానానికి వెళ్ళింది.


పార్వతిని అంత మొందించితే శివుడికి కొడుకు పుట్టే అవకాశం లేదు. తన ప్రాణానికి భయం ఉండదని తలచి తారకాసురుడు వజ్రదంతుణ్ణి పార్వతిని అపహరించుకొని రమ్మని పురమాయించాడు. వజ్రదంతుడు వజ్రాయుధాన్ని పరపర కొరికి పారేయగల వాడి కోరలు గల పెద్ద రాక్షసి ఎలుక రూపంతో కొండల్నిడొల్చి పిండిచేస్తూ, మూషికాసురుడు అని కూడా పేరు పడ్డాడు. పార్వతిని అపహరించుకు రావడానికి ముందు గజకర్ణి, గోకర్ణి అనే తన ముఖ్యానుచరులైన రాక్షసులిద్దర్ని పంపించాడు.


వాళ్లు దున్నపోతుల్లా బలిసిన కుర్రాళ్ళ రూపంతో వెళ్లి, దొంగచూపులు చూస్తూ, సింహద్వారం దగ్గర అంకుశ గదా దండాన్ని పట్టి అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాస్తున్న బాలుణ్ణి, “ఆడుకుందాం రా!” అని పిలిచారు.


బాలుడు వాళ్ళను చూడనట్టే చూసి, నవ్వుతూ, “ముందు కాస్త తినండిరా!” అంటూ రెండు చలిమిడి ముద్దలు వాళ్ళ మీదకు విసిరాడు. వాళ్ళు తలలు దిమ్మ తిరిగి పారిపోబోతూంటే, రెండు ఉండ్రాళ్లు పెద్ద బండరాళ్లై వాళ్ళముందు పడగా బోర్లా పడ్డారు. పుత్రగణపతి వాళ్ళను పిలిచి, “చెవులు పట్టుకొని మూడేసి గుంజీలు తీసి, లెంపలేసుకొని మరీ పొండిరా!” అని ఆజ్ఞాపించాడు. వాళ్ళ లాగే చేసి, రాక్షస రూపాలతో వజ్రదంతుడికి ఎగ ఊపిరితో జరిగింది చెప్పారు.


వజ్రదంతుడు హుంకరించి ఎలుక రూపంతో వెళ్లి ద్వారానికి సమీపంలో బొరియచేసి దూరబోతూండగా పుత్ర గణపతి మొలపాశాన్ని తీసి ఉచ్చు పన్ని విసిరి మూషికాన్ని పట్టాడు. ఉచ్చు

మెడకు బిగిసి కీచుకీచుమంటూన్న దాని నెత్తిన నాలుగు మొట్టికాయలు పెట్టి, తోక పట్టుకొని గిరగిరా తిప్పి విసిరేశాడు.


పుత్రగణపతి విసురుకి మూషికాసురుడు అమాంతంగా అతని రాజ్యంలో అంతఃపురం ముందు దభీమని నిజరూపుతో బోర్లాపడ్డాడు. అతని భార్య ధవళ గొప్ప దేవీ భక్తురాలు. ఎప్పటికీ తన పసుపు కుంకుమలు నిలిచేలాగ భర్తకు చావులేని వరం దేవివల్ల పొందింది! ధవళ భర్తను ఊరడించి వరం సంగతి చెప్పి ధైర్యం కలిగించి, పార్వతి జోలికి పోవద్దని హితవు చెప్పింది.


•••


త్రిపురాసురులను సంహరించి ముందుగా వచ్చిన శివుడు పార్వతిని చూడాలనే తహతహతో హుటాహుటిగా వెళ్ళబోతూంటే బాలుడు అడ్డిగించాడు. శివుడు చకితుడై, “ఎవరు నువ్వు?” అని గద్దించాడు.


బాలుడు పకపక నవ్వుతూ, “అమ్మ కొడుకుని! మాయావులూ , వేషధారులూ తిరుగుతున్నారు, పురుగైనా పోకుండా కాపలా పెట్టింది, మా అమ్మ!” అన్నాడు.


“నేను ఈశ్వరుణ్ణి, దేవుణ్ణి!” అన్నాడు శివుడు.


“నాకు ఎటు వంటి దేవుడితోనూ నిమిత్తం లేదు. అమ్మ ప్రకృతి స్వరూపిణి; ప్రకృతి శాసనాన్ని అనుసరించి నడుచుకోవడం కంటే జీవకోటికి వేరే ధర్మమేదీ లేదుకదా! అమ్మ ఆజ్ఞ పాలించటమే నా విధి!” అన్నాడు బాలుడు.


కొంచెం వెనక నుంచి త్రిపురాసుర  సంహారం చేసిన శివుడి పరాక్రమవీర గాధను గానం చేస్తూ జయ జయ ధ్వానాలతో వస్తూన్న ప్రమథగణాలు, ముక్కోటి దేవతలు అక్కడికి చేరుకొని, శివుడు బాలుడితో ఘర్షణ పడుతూండడం చూసి ఆశ్చర్యంతో బొమ్మల్లాగ నిల్చిపోయి, వాళ్ళ సంవాదం వినసాగారు.


“కుర్రకుంకవు. తెలియక దేవుడు లేడంటున్నావు. అంతటికీ మూలము పరబ్రహ్మము, అతడే దేవుడు!” అన్నాడు శివుడు. “పెద్దవాడివైనా నీకే తెలియనట్టుంది, ఆదిశక్తి నుండి విశ్వమూ, త్రిమూర్తులు వచ్చిన సంగతిని సూక్ష్మంగా చెబుతాను విను,” అంటూ బాలుడు చెప్పసాగాడు:

ఆదిశక్తి రూపు దాల్చి బ్రహ్మను, విష్ణువును, మహేశ్వరుణ్ణి తన మేను విదల్చగా వచ్చిన ఎరుపు, నీలం, తెలుపు రంగుల తేజస్సుల నుండి పుట్టించింది. బ్రహ్మ, విష్ణువు లిద్దరూ దేవి చెప్పింది వినకుండా ధిక్కరించారు. వాళ్లను ఆమె తన మూడో కంటిని తెరిచి బూడిద కుప్పల్ని చేసింది. మహేశ్వరుడు గడుసువాడు; చెప్పినట్టే వింటాను గాని, ముందు మూడోకన్ను తనకు ఇమ్మన్నాడు. దేవి తన మూడో నేత్రాన్ని తీసి అతని నొసట అతికించింది. వెంటనే అతను దాన్ని తెరిచి ఆవిణ్ణి కాల్చాడు. ఆమె మండిపోతూంటే అగ్ని రేణువులు విరజిమ్ముకొని తేజో మండలాలు ఏర్పడ్డాయి. భస్మం రేగి అంతటా నిండింది. ఆ విధంగా విశ్వం ఏర్పడింది. తర్వాత కాలినట్టే కాలి పోయిన దేవి - మళ్ళీ యధారూపంలో కనిపించింది. అందుకే ఆమెను 'మహా మాయ' అని అన్నారు. మహేశ్వరుణ్ణి మెచ్చుకొని, అతణ్ణి లయ కారుడుగా నిర్ణయించింది. బ్రహ్మ, విష్ణువులను వారి బూడిదల నుండి రప్పించింది. కొంత మిగిలివున్న తన బూడిదను మూడు భాగాలు చేసి వాణిని, లక్ష్మిని, ఉమను రూపొందించింది. వాటిని బ్రహ్మ, లక్ష్మిని విష్ణువు, ఉమను మహేశ్వరుడు అర్ధాంగులుగా స్వీకరించి లోకపాలన చేయండని చెప్పి, దేవి అంతర్ధానమైంది.


“నీవు చెప్పిందంతా ఒఠ్ఠి కటుకథ!” అన్నాడు శివుడు.


“నాది కట్టుకథ అయితే బ్రహ్మము దేవుడు అంటూ నీవు చెప్పేదంతా కేవలం మెట్ట వేదాంతం అంటే తప్పేముంది? అంతా దేవుడు నుండి పుట్టిందనడం కంటే ఆదిశక్తి నుండి వచ్చిందనడం ఎక్కువ నిజంగా వినిపించడం లేదా!” అని అడిగాడు బాలుడు. అతని మాటలకు అక్కడున్న మగవాళ్ల ముఖాలు వెల వెల పోయాయి. ఒక్క విష్ణువు మాత్రం మెచ్చుకుంటున్నట్లుగా బాలుణ్ణి చూసి చిరునవ్వు నవ్వాడు. బ్రహ్మ బాలుడి తర్కానికి మురిసిపోయాడు. ఆడవాళ్ళ ముఖాలు కళకళలాడుతూ వికసించాయి.


శివుడు ముఖం ఎర్రగా చేసుకొని, “చూస్తే పసివాడి వైతివి, భయపడకు, నిన్నేమీ చేయనులే! మంచిగా ద్వారానికి అడ్డం తొలగిపో!” అన్నాడు కసురుతున్నట్టుగా. “నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను వెళ్ళనిచ్చేది లేదు!” అన్నాడు బాలుడు నిర్భయంగా. శివుడికి పట్టరాని కోపం వచ్చింది, చప్పట్లు చరిచి ప్రమథగణాలకు సైగచేశాడు. బాలుణ్ణి ఈడ్చి పారేయడానికి వాళ్ళు ముందు కురికారు.


బాలుడు నవ్వుతూ, “పసివాడివంటూ కనికరించినట్లే నటిస్తూ నా మీదకు నీ గణాల్ని బలప్రయోగానికి ఉసిగొల్పడం ఏమైనా బాగుందా? సరే, నేనూ గణాధిపతినే!” అంటూ అంకుశ దండాన్ని

నేలకు గట్టిగా తాటించాడు. నేల ఈనినట్లు పుత్రగణపతి లాంటి రూపురేఖలు గల వాళ్ళు వేలకు వేలు పుట్టుకొచ్చి, నందినీ, శృంగినీ, భృంగినీ, చండీశ్వరుణ్ణీ తమ చేతులో ఉన్న అంకుశాలు, గదలు, పాశాలు, శూలాలతో గొడ్లను తరిమినట్టు తరిమేశారు. మిగతా శివానుచరులంతా జాడలేకుండా పారిపోయారు. పుత్ర గణపతి గణమంతా అదృశ్యమయ్యారు.


శివుడు రుద్రుడై త్రిశూలం ఎత్తాడు. బాలుడు అంకుశదండంతో అడ్డుకోగా ఖంగున మ్రోగుతూ త్రిశూలం పడిపోయింది. బాలుడు పకపక నవ్వుతూ, “మా అమ్మ ఇచ్చిన దండం నా చేత నుండగా నన్నేమీ చేయలేవు. నీ వేదో చేద్దామనుకుంటున్నది నిర్విఘ్నంగా నెరవేర్చాలనే నేను సిద్ధంగా ఉన్నాను, తర్వాత కథ అమ్మ చూసుకొంటుంది!” అంటూ అంకుశ గదా దండాన్ని దూరంగా విడిచి పెట్టాడు. శివుడు ఒళ్ళు తెలియని కోపంతో ఉన్మత్తుడిలాగ త్రిశూలాన్ని బాలుడి కంఠానికి గురి పెట్టి విసిరాడు. మరుక్షణంలో బాలుడు, “అమ్మా!” అని పెద్ద పెట్టున అరుస్తూండగా అతని తల తెగి ఆకాశానికి ఎగిరి పెద్ద జ్యోతిగా వెలిగి పోతూ, అంతరిక్షంలో లీనమైంది.

--(ఇంకా వుంది)

Post a Comment

Previous Post Next Post